
గోపాలపట్నం
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) గోపాలపట్నం 92వ వార్డు పరిధిలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో అధికారులు విస్తృతంగా పర్యటించి పరిశుభ్రతా చర్యలను సమీక్షించారు. జీవీఎంసీ పశ్చిమ జోనల్ కమిషనర్ హేమవతి ఆదేశాల మేరకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్ష సుదర్శన్, శానిటేషన్ సూపర్వైజర్, సచివాలయ కార్యదర్శులు మరియు శానిటేషన్ సిబ్బందితో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వీధులు, మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, వార్డులో పరిశుభ్రత నిరంతరం కొనసాగేలా సచివాలయ కార్యదర్శులు, శానిటేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
పర్యటనలో భాగంగా ఫుట్పాత్లను ఆక్రమించి సాధారణ ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న తోపుడుబండ్లను తక్షణమే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే స్థానిక హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో శానిటేషన్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచినా, పాడైపోయిన నిల్వ ఆహార పదార్థాలను విక్రయించినా, ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ సంచులను వినియోగించినా సంబంధిత వ్యాపారులపై భారీగా జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజారోగ్యం దృష్ట్యా స్థానిక నివాసితులు, వ్యాపారులు జీవీఎంసీ అధికారులకు సహకరించాలని కోరారు.
Comments